అన్నం ముందు నుంచి ఈడ్చుకెళ్లారు!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
13
  • రాత్రిపూట కాంగ్రెస్‌ సర్కారు అరాచకం!
  • బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా వారియర్‌ అరెస్టు
  • పార్టీ ట్వీట్‌ను రీట్వీట్‌ చేయడమే నేరమట!
  • హైదరాబాద్‌లో ఇంటినుంచి శశిధర్‌గౌడ్‌ అరెస్ట్‌
  • కరీంనగర్‌కు తరలింపు.. రోజంతా ఠాణాలోనే
  • పరామర్శకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతల అడ్డగింత
  • ఎట్టకేలకు కోర్టుకు!.. 8 రోజులు రిమాండ్‌

కరీంనగర్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ): ప్రశ్నించే గొంతుకలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతున్నది. సోషల్‌మీడియా వారియర్లపై కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా వారియర్‌ శశిధర్‌ అలియాస్‌ నల్లబాలుపై అక్రమ కేసులతో వేధిస్తున్న రేవంత్‌ సర్కారు, తాజాగా మరోసారి టార్గెట్‌ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్‌ ఖాతాలో బీఆర్‌ఎస్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాడంటూ సుమోటోగా కేసు నమోదుచేసిన కరీంనగర్‌ సైబర్‌క్రైం పోలీసులు ఆదివారం రాత్రి శశిధర్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌ తరలించారు. సోమవారం కరీంనగర్‌ కోర్టులో హాజరుపర్చారు. హైదరాబాద్‌లో కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో అక్రమంగా ఇంటి తలుపులు పగలగొట్టి, అరాచకంగా అరెస్టు తీసుకెళ్లారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

శశిధర్‌ను కరీంనగర్‌ కమిషనరేట్‌లోని సైబర్‌క్రైం పోలీసుస్టేషన్‌కు తరలించారన్న సమాచారంతో జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆయనను కలిసేందుకు వెళ్లగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇటు సైబర్‌క్రైం పోలీసుస్టేషన్‌ వద్ద, అటు న్యాయస్థానం వద్ద రోజంతా ఉత్కంఠ నెలకొన్నది. ఎట్టకేలకు గ్రంథాలయ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డిని మాత్రమే అనుమతించగా వారు వెళ్లి శశిధర్‌ను కలిసి వచ్చారు. సోమవారం సాయంత్రం శశిధర్‌ను రెండో అదనపు పీడీఎం కోర్టులో హాజరుపర్చగా న్యాయవాదులు మధుసూదన్‌రావు, సర్దార్‌ రవీందర్‌సింగ్‌, రాజిరెడ్డి సహా 20 మంది న్యాయవాదులు సైబర్‌క్రైం పోలీసులకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు కూడా విన్న న్యాయమూర్తి శశిధర్‌కు ఎనిమిది రోజుల రిమాండ్‌ విధించారు.

అరెస్టును ఖండించిన బీఆర్‌ఎస్‌ నేతలు
సోషల్‌మీడియా వారియర్‌ శశిధర్‌ను హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆదివారం రాత్రి భోజనం చేస్తుండగా అరెస్టు చేసిన తీరు అత్యంత దారుణమని కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు ఖండించారు. శశిధర్‌ను పరామర్శించిన అనంతరం అనిల్‌కుమార్‌గౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రభుత్వ చూస్తున్నదని, ఎన్ని కేసలు పెట్టినా భయపడేది లేదని స్పష్టంచేశారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని, శశిధర్‌ ఇంటి తలుపులు పగులగొట్టే సమయంలో ఆయనకు చిన్న గాయాలు అయ్యాయని తెలిపారు. గతంలోనూ శశిధర్‌ను అరెస్టుచేసిన పోలీసులు అతని ఫోన్‌ను స్వాధీనం చేయాలని ఒత్తిడి చేశారని, అతను అందుకు అంగీకరించకుండా లీగల్‌గా సమాధానం చెప్పడంతో పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ కార్పోరేటర్ల బోనాల శ్రీకాంత్‌, ఐలేందర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

​ప్రశ్నించే గొంతుకలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతున్నది. సోషల్‌మీడియా వారియర్లపై కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *