ఎమర్జెన్సీతో తలపడిన ఒక తరం యువ కార్యకర్తలు
Follow
శ్రీమతీ ఇందిరా గాంధీ 1975లో ప్రకటించిన ఎమర్జెన్సీ…ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమైన పోరాట సందర్భంగా, రాజ్యాంగ హక్కుల బోలుతనాన్ని వెల్లడించేదిగా, నిరంకుశ అధికారం తలెత్తడానికి దారితీసిన పరిస్థితిగా ముందుకు వచ్చింది. ఎమర్జెన్సీ ప్రకటనను దేశ ప్రజానీకం మీద నిరంకుశ పరిపాలన శాశ్వతంగా రుద్దడానికి చేపట్టిన దుర్మార్గపు చర్యగా సీపీఐ(ఎం) నాయకత్వం తొలుత భావించింది. సుదీర్ఘ కాలంపాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాతర వేసే అవకాశం ఉన్నదని అంచనా వ్యక్తం చేసింది. అయితే కొద్ది వారాల్లోనే ఇది ప్రతిపక్ష రాజకీయ పక్షాలను చెదరగొట్టడానికి శ్రీమతి గాంధీ చేపట్టిన తెలివిమాలిన చర్యగా స్పష్టమయ్యింది.
1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదంతో శ్రీమతి గాంధీ అధికారాన్ని గెలుచు కున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నాటి ప్రభుత్వం నెరవేర్చని ఫలితంగా ప్రజల్లో పెద్దఎత్తున అసంతప్తి గూడుకట్టుకున్నది. 1974లో రైల్వే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె, బీహార్లో జయప్రకాష్ నారాయణ్ మొదలు పెట్టిన ‘సంపూర్ణ విప్లవం’ ఉద్యమం-ఈ రెండూ నాడు ప్రజల్లో నెలకొన్న అసం తప్తికి తార్కాణాలు. శ్రీమతి ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ అసాధారణమైన అప్రజాస్వామిక చర్యకు శ్రీమతీ గాంధీ పూనుకున్నది. చిల్లర రాజకీయ ప్రయోజనం కోసం చేపట్టిన ఈ చర్యను ప్రజాస్వామిక పరిరక్షణ కోసం ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున కదిలించడం ద్వారా వమ్ము చెయ్యవచ్చు.
దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే నాటికి నేను భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) జాతీయ కార్యదర్శిగా, సీపీఐ(ఎం) కార్యకర్తగా పనిచేస్తూ జవహర్లాల్ నెహ్రూ యునివర్శిటీ (జె.యన్.యు)లో డాక్టరేట్ పరిశోధక విద్యార్థిగా ఉన్నాను. అప్పటికి ఎస్ఎఫ్ఐ స్థాపించి (1970) ఐదేళ్లు అయింది. కానీ విద్యార్థుల హక్కుల పరిరక్షణలో, ఇందిరా గాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో సమరశీల సంఘంగా పేరు తెచ్చుకున్నది. ఈ కారణంగానే ఎమర్జెన్సీలో ఎస్ఎఫ్ఐ మీద దాడులు జరిగాయి. ఎస్ఎఫ్ఐకి చెందిన తొమ్మిది మంది కీలక ఆఫీస్ బేరర్లను, నాయకులను అరెస్టు చేసి అంతర్గత భద్రతా చట్టం (మీసా) కింద జైల్లో కుక్కారు. తదనంతరం మరో అరవై మందిని మీసా చట్టం కింద జైలు పాల్జేశారు. దేశవ్యాప్తంగా వందల మంది విద్యార్థి నాయకులను, క్రియాశీల కార్య కర్తలను మరో నిర్బంధ చట్టం డిఐఆర్ కింద అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. ఈ నేపథ్యంలో అరెస్టుకి చిక్కకుండా అజ్ఞాతంలో ఉండి పని చేయమని పార్టీ నన్ను ఆదేశించింది. విద్యార్థి సంఘం జాతీయ స్థాయిలో కనీస కార్యకలపాలు నిర్వహించేలా చూడమని నాకు బాధ్యత అప్పచెప్పింది.
ఢిల్లీలో అధికారగణం జె.ఎన్.యు విద్యార్థుల మీద, విద్యార్థి సంఘం మీదా దాడులు ముమ్మరం చేసింది. జులై 7వ తేదీన వందలాది మంది పోలీసుల విశ్వవిద్యాలయ హాస్టళ్లను చుట్టముట్టి ఇంటరాగేషన్ పేరిట అనేక మందిని పోలీసు స్టేషన్కు తరలించారు. అందులో పదిమందిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని విడిచిపెట్టారు. ఎస్.ఎఫ్.ఐ నాయకత్వంలో జె.ఎన్.యు విద్యార్థులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిఘటనోద్యమాన్ని నిర్వహించసాగారు. పోలీసులు విద్యార్థి సంఘం అధ్యక్షుడు డి.పి. త్రిపాఠీని అరెస్టు చేయ్యడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కర్కోటక పోలీసుగా పేరొందిన డి.ఐ.జి పి.యస్ భిందర్ పోలీసు యూనిఫారం లేకుండా హాస్టల్లోకి ప్రవేశించి ఎస్.ఎఫ్.ఐ కార్యకర్త ఒకరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అయితే డి.పి త్రిపాఠీ అనుకుని ప్రబీర్ పుర్కా యస్థను ఎత్తుకెళ్లారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి బదులుగా పోలీసులు ప్రబీర్ మీద అక్రమ అభి యోగాలు మోపి మీసా కింద అరెస్టు చేసి ఎమర్జెన్సీ ముగిసేంతవరకూ జైల్లో పెట్టారు. విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థి నాయ కుడిని బహిష్కరించిన నేపథ్యంలో జె.ఎన్.యు విద్యార్థులు మూడు రోజుల పాటు సమ్మె చేశారు.
వివిధ భావజాలాలతో పలు విద్యార్థి సంఘాల్లో పని చేస్తున్న విద్యార్థులందరూ దేశవ్యాప్తంగా ఐక్యమై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అజ్ఞాత జీవితం గడుపుతున్నప్పటికీ నేను విద్యార్థి సంఘం కార్యకలాపాలు నడిచేలా చూడడానికి వివిధ రాష్ట్రాలు తిరిగాను. కొన్ని చోట్ల అజ్ఞాత సమావేశాలు నిర్వహించాను. నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా డి.ఎం.కె పార్టీకి చెందిన కరుణానిధి ఉండడం, ఆయన ఎమర్జెన్సీని బహిరంగంగానే వ్యతిరేకిం చడంతో ఎమర్జెన్సీ వ్యతిరేక శక్తులు సమావేశాలు నిర్వహించుకోవడానికి చెన్నై సురక్షిత స్థావరంగా మారింది. ఇది పసిగట్టిన ఇందిరా ప్రభుత్వం 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చెయ్యడంతో ఆ గూడు కాస్తా చెదిరిపోయింది.
21 నెలల్లో ఎమర్జెన్సీ ముగిసిపోయింది. ఈ కాలంలో నా వ్యక్తిగత జీవితం కూడా అనేక మలుపులు తిరిగింది. సీపీఐ(ఎం)లో పనిచేస్తున్న తోటి కార్యకర్త బృందాతో నా వివాహం జరిగింది. మేం ఇద్దరం పాక్షికంగా అజ్ఞాత జీవితం గడుపుతున్నందున మా వివాహం ఒక కామ్రేడ్ నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. బృందా ‘రీటా’ అనే మారు పేరుతో నేను ‘సుధీర్’ అనే పేరుతో అజ్ఞాత జీవితం గడిపాం. జీవితంలో అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంటూ నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన మా అమ్మ కూడా ఈ కాలంలోనే మరణించి నాకు తీరని విషాదాన్ని మిగిల్చింది. నేను అజ్ఞాత జీవితం గడుపుతున్న మూలాన కొద్దికాలం అమ్మకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బృందాతో వివాహమయ్యాక అమ్మను తీసుకొచ్చి మాతోనే ఒక చిన్న అవుట్హౌస్లో అట్టేపెట్టుకున్నాం. నాలుగు నెలలు తిరగకుండానే 54 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది.
ఒక తరం పార్టీ కార్యకర్తలకు అప్పుడే మొదలైన ఉద్యమ జీవితంలో ఎమర్జెన్సీ అనేక అనుభవాలను మిగిల్చింది. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక హక్కులలో బోలుతనం ఏమిటో అర్థమయ్యేలా చేసింది. ప్రజాస్వామ్య హక్కుల పట్ల బేఫర్వాగా ఉండకూడదని తెలియజెప్పింది. అలాగే ప్రజల మధ్య ఉండి పనిచేయడం, ముఖ్యంగా విద్యా ర్థులతో కలిసి పనిచెయ్యడం ద్వారా శ్రమకోర్చి సాధించుకున్న హక్కులను చేజారనీకుండా పరిరక్షించుకునేది అంతిమంగా ఆ ప్రజలే అన్న సత్యం బోధపడింది.
ఎమర్జెన్సీ కాలంలో చురుగ్గా పని చేసి తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొన్న ఎస్.ఎఫ్.ఐ నాయకులు, కార్యకర్తలు తదనంతర కాలంలో సీపీఐ(ఎం) అగ్ర నాయకులుగా ఎదిగారు. మాణిక్ సర్కార్, కొడియేరి బాలకృష్ణన్, సీతారాం ఏచూరి, యం.ఎ.బేబి వంటి వారు ఈ కోవకు చెందినవారే. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి, యువజన ఉద్యమాలకు నాయకత్వం వహించిన అనేక మంది వారి, వారి రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలలో అగ్ర నాయకులుగా ఎదిగారు.
యాభై ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థ మీద తొలిసారిగా జరిగిన దాడిగా ‘ఎమర్జెన్సీ’ అందరి మదిలో నిలిచిపోతుంది. అయితే ఇది హఠాత్ పరిణామంగా భావించరాదు. 1950ల నుంచే ప్రజల ప్రజాస్వామిక హక్కుల మీద, పౌరహక్కుల మీద క్రమేణా పెరుగుతూ వచ్చిన దాడులకు కొన సాగింపుగా జరిగిన పెను దాడిగా మనం గుర్తించాలి.
అలాగే ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులను ఎమర్జెన్సీ కాలంతో సాపత్యం పెట్టి చూడడం కూడా పొరబాటు. గత పదకొండేళ్లుగా మోడీ హయాంలో సాగుతున్న పాలనను ‘అప్రకటిత ఎమర్జెన్సీ’గా పేర్కొనడం కూడా సరైన అవగాహన కాజాలదు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ సూత్రాల మీద జరుగుతున్నది సంస్థా గతంగా నిరంకుశత్వాన్ని నెలకొల్పుతున్న దొంగదాడి. ఇవాళ దేశం యావత్తు చవిచూస్తున్న అపరిమిత నిరంకుశత్వ పోకడలతో పోల్చి చూస్తే ఎమర్జెన్సీ తేలిపోతుంది.
ప్రకాశ్ కరత్
The post ఎమర్జెన్సీతో తలపడిన ఒక తరం యువ కార్యకర్తలు appeared first on Navatelangana.
శ్రీమతీ ఇందిరా గాంధీ 1975లో ప్రకటించిన ఎమర్జెన్సీ…ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమైన పోరాట సందర్భంగా, రాజ్యాంగ హక్కుల బోలుతనాన్ని వెల్లడించేదిగా, నిరంకుశ అధికారం తలెత్తడానికి దారితీసిన పరిస్థితిగా ముందుకు వచ్చింది. ఎమర్జెన్సీ ప్రకటనను దేశ ప్రజానీకం మీద నిరంకుశ పరిపాలన శాశ్వతంగా రుద్దడానికి చేపట్టిన దుర్మార్గపు చర్యగా సీపీఐ(ఎం) నాయకత్వం తొలుత భావించింది. సుదీర్ఘ కాలంపాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాతర వేసే అవకాశం ఉన్నదని అంచనా వ్యక్తం చేసింది. అయితే కొద్ది వారాల్లోనే ఇది ప్రతిపక్ష రాజకీయ పక్షాలను
The post ఎమర్జెన్సీతో తలపడిన ఒక తరం యువ కార్యకర్తలు appeared first on Navatelangana.