కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను మళ్లీ పిలవబోతుందా? ఫైనల్ స్టేజ్కు చేరుకున్న విచారణ.. ఇక వీటిపై ప్రశ్నలు

Follow

కాళేశ్వరం కమిషన్ మరోసారి మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వబోతోందా.? జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ను రెండోసారి విచారించబోతున్నారా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి పరిపాలనా అనుమతులు ఇచ్చారని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన నివేదికపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వివరాలు, కేసీఆర్ చెప్పిన అంశాలు పరస్పరం విరుద్దంగా ఉండటంతో బీఆర్ఎస్ అధినేతను క్రాస్ ఎగ్జామిన్ చేసే యోచనలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. జులై మూడోవారం నాటికి విచారణను పూర్తి చేయాలని భావిస్తున్నారట జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు, ప్రజా ప్రతినిధులు సహా మొత్తం 116 మంది నుంచి వివరాలు సేకరించింది కమిషన్.
అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా నివేదికను ఒక రూపానికి తీసుకొచ్చిన కమిషన్..అందులో ప్రజా ప్రతినిధుల వాంగ్మూలాలను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 6న ఈటల రాజేందర్, 9న హరీశ్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై క్యాబినెట్లో చర్చించామని, మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని ఆ ముగ్గురు కమిషన్కు వివరించారు. అందుకు సంబంధించిన అఫిడవిట్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్కు అందజేశారు.
అయితే రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాసి..కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయాల వివరాలను తెప్పించుకుంది పీసీ ఘోష్ కమిషన్. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2016 మార్చి ఒకటిన పరిపాలనా అనుమతులు ఇచ్చిందని కమిషన్కు డీటెయిల్స్ ఇచ్చిందట నీటిపారుదల శాఖ. మేడిగడ్డ బ్యారేజీ పనులు ప్రారంభించే సమయానికి డీపీఆర్ కూడా లేదని కూడా రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్స్ ఇచ్చిన తర్వాత ఏడాదిన్నరకు 2017లో మంత్రివర్గంలో ర్యాటిఫికేషన్ తీసుకున్నారని, అప్పటికే పనులు ఒక దశకు వచ్చాయని కమిషన్కు ప్రభుత్వం నివేదించినట్లు టాక్ వినిపిస్తోంది.
జులై మొదటి వారంలో నోటీసులు?
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి 2016 మార్చి 1న అనుమతి ఇచ్చారని, 2021 ఆగస్ట్లో సవరించిన అంచనా 4వేల 613 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కమిషన్కు ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన జీవోలను జత చేసినట్లు సమాచారం. మొత్తం కాళేశ్వరం నిర్మాణంపై మంత్రివర్గంతో చర్చించలేదని చెప్పినట్లు చర్చ జరుగుతోంది.
మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కంటే ముందే 2015 ఏప్రిల్ 13న కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కోసం ప్రభుత్వం జీవో 212 జారీ చేసిందని రేవంత్ సర్కార్ కమిషన్కు డీటెయిల్స్ సబ్మిట్ చేసిందంటున్నారు. అయితే అప్పటి మంత్రివర్గం ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం చేపట్టినట్లు కేసీఆర్, హరీశ్, ఈటల కమిషన్కు చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా…కేసీఆర్, ఈటల, హరీశ్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్. రేవంత్ సర్కార్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై మరోసారి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులను విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు. జులై మొదటి వారంలో కేసీఆర్, హరీశ్ రావులను నోటీసులు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే రెండోసారి కేసీఆర్ విచారణకు హాజరవుతారా? ఒకవేళ ఆయన కమిషన్ ముందుకు వెళ్తే ఏం చెబుతారన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా…కేసీఆర్, ఈటల, హరీశ్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్.