కుక్క పంచాయితి.. హైకోర్టులో విచారణ..

Follow

- కోర్టుకు చేరిన కుక్క వివాదం
- పర్మిషన్ లేకుండా నా కుక్కను జీహెచ్ఎంసీ తీసుకెళ్లిందంటూ హైకోర్టులో పిటిషన్
- పిటిషనర్ సోదరుడి ఫిర్యాదుతోనే కుక్కను పట్టుకెళ్లామన్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: నోటీసు ఇవ్వకుండానే తమ కుక్కను జీహెచ్ఎంసీ సిబ్బంది తీసుకెళ్లారంటూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. లైసెన్స్ ఉన్న తన పెంపుడు కుక్కను అప్పగించాలంటూ హైదరాబాద్లోని చిక్కడపల్లికి చెందిన ఈబీ దక్షిణామూర్తి వేసిన పిటిషన్ను జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి బుధవారం విచారించారు. తమ పెంపుడు కుక్కను తీసుకుని వెళ్లేప్పుడు నోటీసు కూడా ఇవ్వలేదని, దానికి వైద్య అవసరాలు ఉన్నాయని, తీసుకువెళ్లిన కుక్కను కోతులు ఉండే బోన్లో పెట్టారని పిటిషనర్ న్యాయవాది వాదించారు.
దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, డ్యూగో అర్జెంటీనా అనే బ్రీడ్ కుక్కలపై నిషేధం ఉందని చెప్పారు. పిటిషనర్ సోదరుడు ఈబీ నరసింహమూర్తి ఫిర్యాదుతోనే కుక్కను తీసుకెళ్లినట్లు వివరించారు. ఆ ఫిర్యాదు మేరకే జీహెచ్ఎంసీకి లేఖ రాశామని, కుక్కను తమపై ఉసిగొల్పి బెదిరిస్తున్నారని, కుక్క కరిచిన మెడికల్ రిపోర్టులే కాకుండా సీసీ టీవీ ఫుటేజీ కూడా ఉన్నట్లు ఫిర్యాదులో ఉందన్నారు. ఆ బ్రీడ్పై నిషేధం ఉన్నప్పుడు ఆ కుక్కకు లైసెన్స్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నిషేధ ఉత్తర్వులు అందజేయాలని సూచించింది. కుక్కను యజమానికి అప్పగించాలంటూ జీహెచ్ఎంసీకి మధ్యంతర ఆదేశాలిచ్చింది.
కుక్కను జన సంచారం ఉన్న చోట వదిలిపెట్టొద్దని, అవసరం అనుకుంటే సిటీకి దూరంగా వెళ్లి వదలాలని పిటిషనర్కు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పిటిషనర్ సోదరుడిని ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పేర్కొంటూ విచారణను జులై 9కి వాయిదా వేసింది.
కుక్క పంచాయితి.. హైకోర్టులో విచారణ..