తెలంగాణ బీజేపీలో రచ్చకు దారితీసిన అధ్యక్ష ఎంపిక.. ఈటలకు అడ్డుపడింది ఎవరు? ఏం జరుగుతోంది?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

ఎట్టకేలకు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పుతోంది అధిష్టానం. సరే ఫైనల్‌గా కొత్త అధ్యక్షుడు అయితే రాబోతున్నారనే జోష్‌ వచ్చేలోపే..బిగ్‌ బాంబ్ పేల్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి వస్తే తన అనుచరులను..పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించి పంపించేశారని..మీ పార్టీకో..దండం మీకో దండం అంటూ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు.

వాస్తవానికి రామ్‌చందర్‌రావు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారన్న వార్తలు వచ్చిన వెంటనే రాజాసింగ్ స్పందించారు. పార్టీ ప్రెసిడెంట్‌ను ఓటేసి ఎన్నుకోవాలి..ఎవరికో దగ్గర అని ఓ వ్యక్తిని అధ్యక్షుడ్ని చేయడం కరెక్ట్ కాదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్‌కు వచ్చి నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు రాజాసింగ్. అయితే రాజాసింగ్‌కు నామినేషన్‌ పత్రాలు కూడా ఇచ్చామని..తనను బలపరుస్తూ పది మంది సంతకం చేయాల్సి ఉండగా..ఆ మద్దతు లేకే రాజాసింగ్ తిరిగి వెళ్లిపోయారంటున్నారు బీజేపీ నేతలు.

Also Read: జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లనాటి వైరం.. కొడుకులు, మనమళ్ల తరం వచ్చినా..

ప్రెసిడెంట్ ఎంపికపై బీజేపీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరుగుతోందట. ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇస్తారని ఆల్‌మోస్ట్ పార్టీ లీడర్లు అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్లుగా ఇన్ఫర్మేషన్‌ కూడా వచ్చిందట. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆల్‌ ఆఫ్ సడెన్‌గా రామ్‌చందర్‌రావు పేరు తెరమీదకు రావడంతో షాక్ అయ్యారట కమలం పార్టీ లీడర్లు. అయితే ఈటల రాజేందర్‌ విషయంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు కొందరు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతున్నారనేది ఓపెన్ సీక్రెట్.

ఆయనది వామపక్షభావజాలమని..కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వొద్దని ఇప్పటికే పలుసార్లు ఆయనపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. అందుకే రేపోమాపో ప్రకటన అంటూ ఆరు నెలలుగా బీజేపీ అధ్యక్ష ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా కొందరు పట్టుబట్టి ఈటలకు అధ్యక్ష పగ్గాలు దక్కకుండా అడ్డుకోగాలిగారని పార్టీలోనే చర్చ జరుగుతోందట. ఇదే క్రమంలో బీజేపీ అధ్యక్ష ఎంపిక పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది.

ఇక బీఆర్ఎస్ విలీనమే బాకీ అంటూ..
అధ్యక్షుడ్ని సెలెక్ట్ చేసింది బీజేపీ అధిష్టానం. ఆయన పనిచేయాల్సింది పార్టీ కోసం. కానీ బీజేపీ అధ్యక్షుడిగా రామ్‌చందర్‌రావు ఎంపిక బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేనంటూ వాయిస్ అందుకుంది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ విలీనమే బాకీ ఉందని అంటున్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య. కేసీఆర్ ఎత్తుగడలు సక్సెస్ అయ్యాయి..బీఆర్ఎస్‌కు అనువైన నాయకుడే బీజేపీ అధ్యక్షడయ్యాడు అంటూ ఆ రెండు పార్టీలపై బాణాలు ఎక్కుపెడుతున్నారు.

అయితే అంతకంటే ముందే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడం చర్చకు దారితీస్తోంది. బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు చక్రం తిప్పారని..చంద్రబాబు చెప్పిన వ్యక్తికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని బీఆర్ఎస్‌ సోషల్ మీడియా ఆరోపిస్తోంది. ఈ ప్రచారంపై కేంద్రమంత్రి బండిసంజయ్‌ స్పందించాల్సి వచ్చింది.

ఇలా కాషాయ రథసారధి ఎంపిక ఇంటా బయట రచ్చ లేపుతోంది. ఓవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలోనే రచ్చరంబోలా అవుతుంటే..మరోవైపు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌..బీజేపీ సెంట్రిక్‌గా డైలాగ్‌వార్‌కు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చక్కపెట్టడం..రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడటం రామ్‌చందర్‌రావుకు కత్తిమీద సాములాంటిదేనన్న చర్చ జరుగుతోంది. స్టేట్‌ ప్రెసిడెంట్ సెలక్షన్‌పై రచ్చ ఇంతటితోనే ముగుస్తుందా..పిక్చర్ ఇంకా బాకీ ఉందా అనేది వేచి చూడాలి మరి.

​కాషాయ రథసారధి ఎంపిక ఇంటా బయట రచ్చ లేపుతోంది. ఓవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలోనే రచ్చరంబోలా అవుతుంటే..మరోవైపు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌..బీజేపీ సెంట్రిక్‌గా డైలాగ్‌వార్‌కు దిగుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *