బంజారాలకు మంత్రిపదవి ఇవ్వాలి

Follow

అమీర్పేట్, జూన్ 29: రాష్ట్రంలోని గిరిజన జనాభాలో సింహ భాగం (దాదాపు 80%) జనాభా కలిగి ఉన్న బంజారాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ బంజారా ప్రజాప్రతినిధులు, మేధావులు, వివిధ విభాగాల అధికారులు డిమాండ్ చేశారు. బేగంపేట్లోని హోటల్ టూరిజం ప్లాజాలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్ అధ్యక్షతన జరిగిన ‘బంజారా ఆత్మీయ సమ్మేళనం’లో రాష్ట్రంలోని బంజారా ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, మా జీ ఎమ్మెల్యేలు, ప్రముఖ బంజారా నాయకులు, మేధావులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. బంజారా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర కేబినేట్లో స్థానం కల్పించకపోవడం, అలాగే ప్రభుత్వ పాలనలో, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో, నామినేటెడ్ పదవుల నియమకాల్లో గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని సమ్మేళనం గుర్తించింది.
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..
బంజారాల భాష, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ, అభివృద్ధికి తండా డెవలప్మెంట్ కార్పోరేషన్ను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని 10% ఉన్న గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ST కమిషన్ను ఏర్పాటు చేయాలని, బంజారాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులతో పాటు రాష్ట్ర శాసనమండలిలో గిరిజనులకు ప్రజాప్రతినిధుల, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, గవర్నర్ కోటాల్లో ఒక్కోస్థానాన్ని, ఒక రాజ్యాసభ స్థానాన్ని, నామినేటెడ్ పరిపాలనా పదవుల్లో జనాభా ప్రాతిపదికన 10% ప్రాతినిధ్యం కల్పించాలని, భూమిలేని నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల భూమి కేటాయించాలని, తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలంటూ సమావేశంలో తీర్మానించారు.
తమడి మాండ్ల సాధనే లక్ష్యంగా త్వరలోనే బంజారాల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు వక్తలు పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, బంజారా సీనియర్ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మాజీమంత్రి రవీంద్ర నాయక్, మాజీమంత్రి, మేధావులు సంఘం అధ్యక్షులు ధనుంజయ నాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరి చరణ్, పిరియా నాయక్, పాండురంగ నాయక్, ఐటీ కమిషనర్ ప్రకాష్ రాథోడ్, రాజేష్ నాయక్, ప్రొఫెసర్లు.. రెడ్యానాయక్, రాజు నాయక్, భీమా నాయక్ పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గిరిజన జనాభాలో సింహ భాగం (దాదాపు 80%) జనాభా కలిగి ఉన్న బంజారాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ బంజారా ప్రజాప్రతినిధులు, మేధావులు, వివిధ విభాగాల అధికారులు డిమాండ్ చేశారు.