మనకూ బంకర్ బస్టర్!.. అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో

Follow

- అగ్ని-5 క్షిపణికి కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: ఇరాన్కు చెందిన భూగర్భ ఫోర్డో అణు పరిశోధన కేంద్రంపై గత వారం జీబీయూ-57/ఏ బంకర్ బస్టర్ బాంబును అమెరికా ప్రయోగించిన నేపథ్యంలో భారత్ కూడా సొంతంగా అధునాతన బంకర్ బస్టర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే చర్యలు చేపట్టింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5కి సంబంధించిన అధునాతన వ్యవస్థను రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నది. అగ్ని 5 పరిధి 5,000 కిలోమీటర్లు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న క్షిపణి 7,500 కిలోల బంకర్ బస్టర్ బాంబును మోసుసుకెళ్లగలదు. భూగర్భం లోపల 80 నుంచి 4,100 మీటర్ల అడుగున నిర్మించుకున్న శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ కొత్త వ్యవస్థకు ఉంటుంది.
ఖరీదైన బాంబర్ విమానానికి బదులుగా..
భూగర్భంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం అమెరికాకు చెందిన జీబీయూ-43, జీబీయూ-57 (మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్గా పేరు) మాత్రమే ఉంది. అమెరికా తరహాలో వీటిని తరలించడానికి ఖరీదైన బాంబర్ విమానాన్ని వాడడానికి బదులుగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అగ్ని-5 క్షిపణిని అభివృద్ధి చేయాలని డీఆర్డీఓ భావిస్తున్నది. క్షిపణి ద్వారా ఈ బాంబును ప్రయోగించాలని భారత్ యోచిస్తున్నది. దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువని భావిస్తున్నది. అగ్ని-5కి సంబంధించి రెండు కొత్త వేరియంట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఒకటి సుదూర లక్ష్యాలను గాలిలోనే ధ్వంసం చేసే బాంబును మోసుకువెళ్లే క్షిపణి కాగా మరొకటి భూగర్భంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల క్షిపణి.
కొత్తగా అభివృద్ధి చేసే అగ్ని-5 క్షిపణి కొత్త వేరియంట్లు పయనించే దూరం 2,500 కిలోమీటర్లు తగ్గనున్నది. అధిక బరువుతో కూడిన బాంబును తీసుకెళ్లగల ఈ కొత్త వేరియంట్లు భారత్ వ్యూహాత్మక అస్త్ర సంపదకు మరింత బలం చేకూర్చగలదు. పాక్, చైనా వంటి శత్రు దేశాల కీలక సైనిక మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణులను భద్రపరిచిన స్థావరాలను ఈ క్షిపణులు పూర్తిగా ధ్వంసం చేయగలవు. హైపర్సానిక్ బాంబులుగా పిలిచే ఈ బంకర్ బస్టర్ బాంబులు అమెరికా బాంబుల కన్నా అధిక బరువు ఉండడమేగాక అత్యంత శక్తివంతమైనవి.
అంతరిక్షంలో నిఘా నేత్రం!
ఆపరేషన్ సిందూర్ అనుభవాలు, పాఠాల నుంచి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. మిలిటరీ నిఘా సామర్థ్యాల్ని మరింత బలోపేతం చేసుకోవటంపై దృష్టి సారించింది. పాకిస్థాన్, చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలంటే అంతరిక్ష ఆధారిత సైనిక నిఘా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. 2029లోగా 52 డిఫెన్స్ శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ సిద్ధమవుతున్నది. రూ.26,968 కోట్ల వ్యయంతో ‘స్పేస్ బేస్డ్ సర్వైవలెన్స్ ఫేజ్-3’ (ఎస్బీఎస్-3) ప్రోగ్రాంను చేపట్టింది. ఫేజ్-3 కింద చైనా, పాకిస్థాన్, హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా నిరంతర ట్రాకింగ్, నిఘా మెరుగుపర్చటం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్బీఎస్-3 ప్రోగ్రాంకు కేంద్ర క్యాబినెట్ కమిటీ గత ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇరాన్కు చెందిన భూగర్భ ఫోర్డో అణు పరిశోధన కేంద్రంపై గత వారం జీబీయూ-57/ఏ బంకర్ బస్టర్ బాంబును అమెరికా ప్రయోగించిన నేపథ్యంలో భారత్ కూడా సొంతంగా అధునాతన బంకర్ బస్టర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే చర్యలు చేపట్టింది.