రైతులకు సంకెళ్లు

Follow

- నాడు లగచర్ల.. నేడు పెద్ద ధన్వాడ
- బెయిల్ మంజూరైనా బేడీలెందుకని ఉమ్మడి జిల్లా ప్రజల ప్రశ్నలు
- మొదటి నుంచి జోగుళాంబ గద్వాల పోలీసుల అత్యుత్సాహం
- జిల్లా పోలీసులు, ప్రభుత్వ తీరును తప్పు పడుతున్న రైతులు, ప్రజా సంఘాలు
గద్వాల/అలంపూర్, జూన్ 18 : వారు తీవ్రవాదులు కాదు.. హత్యలు అరాచకాలు చేసిన వ్యక్తులు అసలే కాదు.. సామాన్య బక్క చిక్కిన రైతులు.. వారు ఆరుగాలం శ్రమంచి పంటలు పండిస్తేనే అందరికీ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. వారు పస్తులున్నా.. ప్రకృతి సహకరించకున్నా భూమిని నమ్ముకొని జీవిస్తున్న సామాన్య రైతులు. వారు చేసిందల్లా బంగారు పంటలు పండే తమ పొలాల పక్కన పచ్చని పైర్లను నాశనం చేసే ఇథనాల్ మహమ్మారి అనే పరిశ్రమను కొంత మంది కార్పొరేట్ శక్తులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే, పరిశ్రమ ఏర్పాటైతే తమ నోటికాడ ముద్ద విషం అవుతుందని కడుపు మండి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని, శాంతియుత వాతావరణంలో నిరసనలు, నిరాహార దీక్షలు చేశారు.
ఏనాడూ కంపెనీ ఆస్తులు ధ్వంసం చేయలేదు. కార్పొరేట్ కంపెనీ యాజమాన్యం ఇచ్చే కాసులకు కక్కుర్తి పడిన నడిగడ్డ ఖద్దరు గద్దలు కంపెనీ యాజమాన్యానికి చేయూత నిచ్చి, కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో యాజమాన్యం కవ్వి ంపు చర్యలకు పాల్పడితే వారు కంపెనీ ఏర్పాటును అడ్డుకోవడంతో పాటు, తమ హక్కుల కోసం తమ భూములను కాపాడు కోవడంలో భాగంగా కంపెనీ దగ్గర ఆందోళన చేశా రు. ఆందోళన చేసే క్రమంలో యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా ఆగ్రహించిన రైతులు కంపెనీ ఆస్తులు ధ్వంసం చేశారు. అందులో భాగంగా 41మంది రైతులపై కేసులు నమోదు చేయగా 12 మంది అన్నదాతలను జైలు కు తరలించారు. రైతులపై దాడికి పాల్పడిన యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా ఇక్కడి పోలీసులు తమ వక్రబుద్ధిని చూపించారు. అందుకు ఫలితంగా అక్కడ ఎస్సైని బదిలీ చేశారు.
హక్కుల కోసం పోరాడితే అన్నదాతకు బేడీలా..?
గ్రామ సమీపంలో తుంగభద్రనది నది పరీవాహక ప్రాంతంలో బంగారం పండే భూములు, ఇథనాల్ కంపెనీ పేరుతో పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతూ తమకు ముద్ద పెట్టే భూములు లాక్కొనే యత్నం చేస్తుంటే కడుపు మండిన రైతన్న తమ భూములను, హక్కులను కాపాడుకోవడానికి యాజమాన్యంపై తిరగబడ్డారు. కానీ కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ పది మందికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నకు సంకెళ్లు వేసి ఏదో పెద్ద నేరం చేసిన వారిలాగా రైతులకు సంకెళ్లు వేసుకొని కోర్టుకు తీసుకరావడంపై అటు రైతన్నలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ంగా మండి పడుతున్నారు. నాడు న్యాయం కోసం పోరాడితే లగచర్ల రైతులకు సంకెళ్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రాజోళి మండలం పెద్దధన్వాడ గ్రామ రైతులు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వారికి సంకెళ్లు వేసి రైతుల పట్ల క్రూరంగా వ్యవహరించడంపై అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు.
బెయిల్ మంజూరైనా ?
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రాజోళి మండలం పెద్దధన్వాడ గ్రామానికి చెందిన 41 మంది రైతులపై రాజోళి పోలీసులు ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేశారు. అందులో 12మంది రైతులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ ముగియడంతో, జిల్లా కోర్టు 12మంది రైతులకు సంబంధించి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు ఆర్డర్ రాలేదనే నెపంతో వారిని విడుదల చేయలేదు. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో 12మంది రైతులను ఉగ్రవాదులను తీసుకువచ్చినట్లు బేడీలు వేసుకొని బుధవారం అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకొచ్చారు. రైతులను జిల్లా జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఇద్దరిదద్దరికి బేడీలు వేసుకొని తీసుక రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బెయిల్ మంజూరైనా అన్నదాతలకు బేడీలు వేసుకొని అలంపూర్ కోర్టుకు తీసుకురావడంపై రైతు, ప్రజా సంఘాల నాయకులు మండి పడుతున్నారు.
షరతులతో కూడిన..
మంగళవారం సాయంత్రం 12 మంది రైతులకు బెయిల్ రావడం, రిమాండ్ గడువు ముగియడంతో బుధవారం 12 మంది రైతులకు పోలీసులు బేడీలు వేసుకొని అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చారు. బె యిల్కు కావాల్సిన జామీన్ పత్రాలతో పాటు ఇద్దరు సాక్షు లు, పదివేల పూచీకత్తును సమర్పించడంతో జడ్జి షరతుల తో కూడిన బైయిల్ను మంజూరు చేశారు. పోలీసుల అనుమతి లేనిదే గ్రామం విడిచి వెళ్లకూడదని, ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్లాలనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అనంతరం వారిని మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. అన్ని పత్రా లు రైతుల తరఫున న్యాయవాది జడ్జికి అందజేయగా, జడ్జిబెయిల్ ఆర్డర్ మంజూరు చేయడంతో ఆ కాపీలను తీసుకొని రైతుల తరఫున న్యాయవాది మహబూబ్నగర్ జైలు దగ్గరకు వెళ్లి బెయిల్ పత్రాలు చూయించడంతో రాత్రి వరకు రైతులను జైలు నుంచి విడుదల చేశారు.
ఆది నుంచి జిల్లా పోలీసుల అత్యుత్సాహం
ఇథనాల్ కంపెనీ ఏర్పాటు విషయంలో ఆది నుంచి పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూనే ఉన్నది. ఇథనాల్ పరిశ్రమ వద్దని రైతులు వ్యతిరేకిస్తుంటే, పోలీసులు మాత్రం కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆది నుంచి కూడా పోలీసులు కంపెనీ యాజమాన్యానికి మద్దతుగా రైతులపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు పెద్ధధన్వాడ రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీ విషయంలో మొదటి నుంచి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేసినట్లు రైతులు ఆరోపించారు. ఏదేమైనా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి రైతులకు వచ్చిన బెయిల్ నిదర్శనం.
రైతు కుటుంబాల ఆక్రోశం
కాలుష్యం వెదజల్లె కంపెనీ వద్దని శాంతియుత ఉద్యమాలతో అడ్డుకోవడమే నేరమా..? ఎంత మందిని హత్య చేశారని చేతులకు బేడీలు వేసి లాక్కెల్లారు.. అని బాధిత కుటుంబ సభ్యులు, బాధిత గ్రామాల ప్రజలు ప్రభుత్వం పై ఆక్రోశం వెళ్లగక్కారు. అన్నం పెట్టే అన్నదాతలకు కాం గ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా శ్రేయస్సుస కోరే ప్రభుత్వం ప్రజా ఆరో గ్యం, ప్రజల కష్టాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే రైతులను అరెస్టు చేసి జైళ్ల పాలు చేస్తుంటే….పాలకులు చేతు లు ముడుచుకొని కూర్చున్నారని ఆవేదన చెందారు.
చేతులకు బేడీలతో వీడియో వైరల్
పోలీసులు ఎంత గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా, మీడియా వారిని ఫొటోలు, వీడియోలు తీయొద్దని హుకూం జారీ చేసినా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రైతుల చేతులకు బేడీలు ఉన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, ఓ టీవీ చానల్లో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నత స్థాయి బాస్లు క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందిపై చిందులేసినట్టు సమాచారం.
బేడీలు వేయడానికి వారేమైనా రౌడీలా..?
చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకుపోవడానికి వారేమైనా రౌడీలా.. అన్నం పెట్టే అన్నదాతలు. అలాంటి వారిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడడమే సిగ్గుచేటు. ఇథనాల్ కంపెనీ మాకొద్దని ఎదిరించిన రైతులపై ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. లగరచ్ల మాదిరి అలంపూర్లో కూడా రైతులకు బేడీలు వేశారు. కంపెనీ అనుమతులు రద్దు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఏర్పాటు చేయనీయం అన్న మంత్రులు హామీలు ఏమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతూ ప్రజా సమస్యలను రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ వారికి కమీషన్లే ముఖ్యం.. వాటి కోసం ఎవరి ప్రయోజనాలైనా తాకట్టు పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.
– విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే
మగ దిక్కు లేక వ్యవసాయం కుంటుబడింది
ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని చేపట్టిన ఆందోళనలో నా భర్త ఏసన్నను పోలీసులు పట్టుకుపోయారు. దీంతో మా ఇంట్లో పెద్దదిక్కు లేక చాలా అవస్థలు పడ్డాం. అడప దడపా వర్షాలు వచ్చినా నా భర్త లేక పోవడంతో విత్తనాలు కూడా వేసుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ఇంత అనర్థాలు జరుగుతున్నాయి. మర్డర్లు, మానభంగాలు చేసినోళ్లలాగా మా వాళ్లను బేడీలు వేసి కోర్టుకు తీసుకుపోవడం చాలా బాధగా ఉంది. ప్రభుత్వం దిగి వచ్చి న్యాయం చేసే వరకు మా పిల్లల భవిష్యత్ కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇథనాల్ కంపెనీని పెట్టనీయం.
– రంగమ్మ, బాధిత కుటుంబ సభ్యురాలు, పెద్ద ధన్వాడ
బేడీలతో బెదిరేది లేదు..
అక్రమ కేసులు కట్టి బేడీలు వేసి జైలులో పెట్టినంత మాత్రానా ఉద్యమం ఆగదు. రైతులకు బేడీలు వేసి బెదిరించలేరు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు మోక మీదకు వచ్చి అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అన్నదాతలను దోచుకోవడమే ప్రభుత్వ లక్ష్యమా? రైతులను రాజును చేస్తాం అని చెప్పి కటకటాల పాలు చేయడం ఎంత వరకు కరెక్టు. ఉగ్రవాదుల్లాగా రైతుల చేతులకు బేడీలు వేయడం కరెక్టు కాదు. గత నెల రోజులుగా ఊర్లు అయోమయంలో ఉన్నాయి. ఏ మంత్రి కూడా బాధిత గ్రామాల్లో పర్యటించలేదు. మా వాళ్లు ఈ రోజు విడుదల అయితున్నారు. త్వరలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం.
– మద్దిలేటి, బాధిత కుటుంబ సభ్యులు, పెద్ద ధన్వాడ
వారు తీవ్రవాదులు కాదు.. హత్యలు అరాచకాలు చేసిన వ్యక్తులు అసలే కాదు.. సామాన్య బక్క చిక్కిన రైతులు.. వారు ఆరుగాలం శ్రమంచి పంటలు పండిస్తేనే అందరికీ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. వారు పస్తులున్నా.. ప్రకృతి సహకరించకున్నా భూమిని నమ్ముకొని జీవిస్తున్న సామాన్య రైతులు.