వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికలు.. రాజకీయాల్లోకి వస్తారా? అన్న విషయంపై కుండ బద్దలుకొట్టినట్లు గంగూలీ సమాధానం

Follow

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోకి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (53) ప్రవేశిస్తారా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై గంగూలీ కుండ బద్దలుకొట్టినట్లు సమాధానం చెప్పేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో తనకు పెద్ద పదవి ఇస్తానని చెప్పినా కూడా తన నిర్ణయం మారదని గంగూలీ అన్నారు. కొందరు రాజకీయ పార్టీల నేతలను గంగూలీ కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆయా పార్టీలో చేరతానని ఆయన ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు.
ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా కూడా నిర్ణయాన్ని మార్చుకోరా? అని తాజాగా ఓ విలేకరి అడిగారు. దీనికి కూడా తనకు ఆసక్తి లేదని గంగూలీ చెప్పారు.
ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ స్కామ్పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనాలని వారు ఆహ్వానించగా గంగూలీ తిరస్కరించారు.
ఆ టీచర్లు గంగూలీ నివాసానికి వెళ్లి ఆహ్వానం అందించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డగించి, ఆహ్వానం ఇచ్చే ప్రక్రియపై చర్చించేందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు.
ఆ సమయంలోనూ ఆ టీచర్లకు గంగూలీ కీలక సందేశం పంపారు. “దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు” అన్నారు. ఆ సమయంలో ర్యాలీలో పాల్గొనాలని తనకు ఇవ్వాలనుకుంటున్న ఆహ్వాన పత్రాన్ని తన కార్యాలయంలో ఉన్న సిబ్బందికి ఇవ్వాలని చెప్పినప్పటికీ, టీచర్లు నేరుగా గంగూలీని కలవాలని పట్టుపట్టారు.
అక్కడికి వచ్చిన పోలీసులు ముగ్గురు టీచర్లను ఠాకుర్పుకుర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కాగా, గత ఏడాది మార్చిలో లోక్సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గంగూలీ కలిసిన అనంతరం ఆయన రాజకీయాల్లోకి రావచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా కూడా నిర్ణయాన్ని మార్చుకోరా? అని తాజాగా ఓ విలేకరి అడిగారు.