75 వసంతాల ఎ.ఐ.ఐ.ఇ.ఎ- భారత కార్మికోద్యమంలో సముచిత పాత్ర
Follow
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ), బీమా రంగంలోని ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెజారిటీ ట్రేడ్ యూనియన్. నేడు ప్లాటినం జూబ్లీ వసంతంలోకి అడుగిడుతున్నది. సంఖ్య పరంగా చిన్నదే అయినప్పటికీ అత్యంత ప్రభావంతమైన ప్రయాణాన్ని సాగించింది. ఎల్ఐసీ ఆవిర్భావానికి కన్నా ముందు అంటే 1జూలై 1951న పురుడు పోసుకుని సంస్థలోని ఉద్యోగుల భవిష్యత్తుని సుస్థిరమైన స్థితిలో, సహచర రంగాలన్నింటికన్నా మిన్నగా, నిర్మించింది.ఎల్ఐసీ ఆవిర్భావంతో పాటు దేశవ్యాప్తంగా అది పటిష్ట పడాలని భారత ఆర్థిక వ్యవస్థకు ఒక చోదక శక్తిలా ఏర్పడాలని నిరంతరం ఉద్యోగులను పురమాయిస్తూ వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ పనికి మాత్రమే సంబంధించిన ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నూతన వ్యాపార సేకరణలో నిమగమై ఉండే ఫీల్డ్ ఫోర్స్, ఏజెంట్లను అనేక సందర్భాల్లో కదిలిస్తూ, సర్విసింగ్ ఫోర్ట్ నైట్లను, నూతన వ్యాపార సేకరణకు కార్యక్రమాలను పిలుపునిచ్చింది. మెగా బిజినెస్డే అను పేరు పైన నూతన వ్యాపారంలో దేశవ్యాప్త రికార్డు నెలకొల్పడానికి మేనేజ్మెంట్తో కలిసి తనవంతు కృషిచేసి ఎల్ఐసి ఇండియా గిన్నిస్ బుక్లో స్థానం సంపాదిం చేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి అనే పేరుసంపాదించడంలో, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్గా అవతరిం చడంలో, ఇప్పటికి కూడా డెబ్బయి శాతానికి పైగా ప్రజలు ఎల్ఐసిని మాత్రమే ఆదరించేలా చేయడంలో ఒక కార్మిక సంఘంగా ఎఐఐఇఎ ఎంతో కృషి చేసింది. పాలసీదారులకు మెరుగైన సేవలందించడమే కర్తవ్యమని 1974లో తన అఖిల భారత మహా సభలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ”సంస్థ ప్రగతియే ఉద్యోగుల భవిష్యత్తు” అన్న నినాదాన్ని మర్చిపోకూ డదని ఎప్పటికప్పుడు ఉద్యోగులను వెన్నుతడుతూనే ఉంటోంది. అందుకే ఏ ప్రయివేటు కంపెనీ కనీసం ఎల్ఐసి మొత్తం వ్యాపారంలో పది శాతానికి కూడా చేరుకోలేకపోతున్నాయి.
కంప్యూటరీకరణకు వ్యతిరేకంగా…
ఎల్ఐసీని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ఎఐఐఇఎ అనేక సందర్భాల్లో ఆచరించి విజయం సాధించిన ఎత్తుగడలు ఎంతో అనుసరణీయమైనవి. 1967లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలేమీ చేయకుండా ఎల్ఐసిలో కంప్యూటరీకరణ ప్రవేశపెట్టాలని ఏకపక్ష నిర్ణయంతో మేనేజ్మెం ట్ను పురమాయించింది. అప్పుడప్పుడే విస్తరిస్తున్న ఎల్ఐసీలో భవిష్యత్తు నియామకాలు, పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు ఈ కంప్యూటరీకరణ నష్టం కలుగజేస్తుందన్న అంచనాలతో దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఎలాగైనా కంప్యూటర్లను కలకత్తా డివిజనల్ ఆఫీస్లో ప్రవేశపెట్టాలని మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని భౌతికంగా అడ్డుకోవాలని నిర్ణయించింది. సముద్ర మార్గాన తెచ్చిన కంప్యూటర్లను ఫలానా రోజు రాత్రి ఇలాకో అనే భవనంలో ఉన్న ఎల్ఐసి ఆఫీసుకు తీసుకురానున్నారన్న సమా చారాన్ని ముందుగానే తెలుసుకుని బిల్డింగ్ దగ్గర ఆ నాయకులు, కార్యకర్తలు కాపలా కాస్తూ రాత్రంతా కర్రల సహాయంతో గస్తీ తిరిగి యాజ మాన్యాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ రోజుల్లో అధికారంలో ఉన్న జ్యోతిబసు ప్రభుత్వం ఎఐఐఇఎ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్రప్రభుత్వానికి పోలీస్ సహాయాన్ని ఇవ్వడానికి నిరాకరించింది.దాంతో కంప్యూటరీకరణ నిర్ణయంపై అప్పటి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.ఇంతటి వీరోచిత పోరాటాన్ని చేపట్టినందుకు నాటి కేంద్ర సర్కార్ ఎఐఐఇఎ గుర్తింపును కూడా రద్దు చేసింది. 1985లో ఎల్ఐసీ ఆఫ్ ఇండియాను ఐదు ముక్కలుగా విడగొట్టాలని రాజీవ్గాంధీ ఆధ్వర్యంలోని నాటి ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఐ(ఎం) పార్టీ ద్వారా రాజ్యసభలో ఎంపీగా ఉన్న ఎఐఐఇఎ పూర్వ నాయకులు కామ్రేడ్ సునిల్ మైత్ర రాజీవ్గాంధీకి ఎల్ఐసి ఐదు ముక్కలుగా చేస్తే జరిగే నష్టాలూ పూసగుచ్చినట్లు వివరించి, సదరు ప్రతిపాదనను విరమించు కునేలా చేశారు.
ప్రయివేటీకరణకు అడ్డుకుని…
భారత ఇన్సూరెన్స్ రంగాన్ని అధ్యయనం చేయాలని 1993లో నాటీ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆర్.ఎన్. మల్హోత్రా నేతృత్వంలో వేయబడిన కమిటీ స్థూలంగా ఇన్సూరెన్స్ రంగ ప్రయివేటీకరణ ప్రతిపాదించింది. ఒక దశాబ్దం పాటు ఈ కమిటీ నిర్ణయాలు ఏమాత్రం అమలు జరగకుండా వివిధ కార్యక్రమాల ద్వారా ఎఐఐఇఎ అడ్డుకున్నది. అందులో అత్యంత ప్రధానమైనది సంతకాల సేకరణ. 1998లో కోటీ అరవై ఐదు లక్షల సంతకాలు దేశవ్యాప్తంగా ప్రజలనుండి సేకరించి, ఆనాటి పార్లమెంటు స్పీకర్ జీఎంసీ బాలయోగికి సమర్పి ంచి, ఇన్సూరెన్స్ రంగ ప్రయివేటీకరణను దేశవ్యాప్తంగా ప్రజలు అంగీకరించడం లేదన్న సందేశాన్ని పంపింది. అనేకమంది రాజకీయ ప్రముఖులు కార్మికసంఘాల మేధావులు ఇలాంటి వినూత్న కార్యక్రమం పట్ల విస్తుపోయారు, అభినందిం చారు. ఇలా ప్రజల, ప్రముఖుల, ఎమ్మెల్యేల, ఎంపీలు, మంత్రుల అభిప్రాయాన్ని ప్రభుత్వ రంగ ఎల్ఐసీకి అనుకూలంగా గత మూడున్నర దశాబ్దాల నుండి అనేక సందర్భాల్లో సేకరిస్తూ ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నది. గత సంవత్సరం ఎఐఐఇఎ నిరంతర ఫాలో అఫ్ వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తగ్గిం చాలని పార్లమెంటులో పెద్ద చర్చ జరిగింది.
ఎఫ్డిఐలను నిరసిస్తూ…
అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారా 1999లో ఐఆర్డిఎఐ బిల్ పాస్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ రం గంలోకి ప్రయివేటు కంపెనీల ఆగమనం మొదలైంది. ఇక చేసేదేమీ లేదు కదా అని నిమ్మకుండిపోకుండా, ప్రయివేటు కంపెనీల ఆగడాలు వాటి వల్ల ప్రజలకు జరిగే నష్టాలు వివరించడానికి కళారూపాల ద్వారా జాతాలు నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను అది ప్రజలకు దేశానికి ఉపయోగపడే వాస్తవాలను వివరించి మంచి ప్రచారాన్ని ఎఐఐఇఎ చేపట్టింది. దేశంలోని 110 డివిజన్లలో ప్రతి ప్రాంతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, సెమినార్లని నిర్వర్తిస్తూ ఇన్సూరెన్స్ రంగంలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదన్న ప్రచారాన్ని హోరెత్తించింది. 2004లో ఏర్పడిన యూపీఎ-1 పభుత్వంలో వామపక్ష పార్టీలు భాగస్తులుగా ఉండడంతో 2004 నుండి 2014 వరకు ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐ పెంపు ప్రతిపాదన లేకుండా ఉండేందుకు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో అలాంటి విషయం ప్రస్తుతించబడేలా కృషిచేసింది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐ 26 నుండి 49కి ఆ తదనంతర కాలంలో 49 నుండి 74 శాతానికి పెంచబడింది. ఇప్పుడు వంద శాతం పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇలా పెంచిన ప్రతి సందర్భంలోనూ ఎఐఐఇఎ దేశవ్యాప్తంగా సమ్మె చేసింది. 2021 బడ్జెట్లో ఎల్ఐసి నుండి 3.5శాతం వాటాల ఉపసంహరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగింది. ఇప్పుడు మళ్లీ మరిన్ని వాటాల ఉపసంహరణకు, ఇన్సూరెన్స్ చట్టాల సవరణకు కేంద్రం చకచకా పావులు కదుపుతుంటే భవిష్యత్తు తరాల ముందు దోషిగా నిలబడకూడదని, ఆ నిర్ణయాలను సవాలు చేయడానికి పోరాటాలతో సిద్ధమవుతోంది. గతంలో ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం వెనకాడలేదు గదా అనిపించవచ్చు, కానీ ప్రభుత్వాల దూకుడును పూర్తిగా నిలువరించలేక పోయినా, కొంతకాలం అడ్డుకొని తద్వారా కొన్ని రకాల సవరణలు సాధించడంతో ఎంతో మేలు జరిగిందని చరిత్ర చెబుతోంది. 1972 లో ఎఐఐఇఎ చీల్చాలని ఫెడరేషన్ అనే సంఘం విఫల ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాలంలో బీఎంఎస్,ఐఎన్టియుసి వంటి సంఘాలు కూడా మొలకెత్తి నమమాత్రానికే మాత్రమే పరిమితమయ్యాయి. అస్తిత్వవాదాన్నెప్పుడూ ఎఐఐఇఎ సభ్యులు బలపరచలేదని దీని ద్వారా రుజువయ్యింది.
కార్మిక, కర్షక ప్రయోజనాలే లక్ష్యంగా…
ఏఐఐఇఎ కేవలం ఇన్సూరెన్స్ ఉద్యోగుల భవితవ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. గత నాలుగు దశాబ్దాల నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న అఖిల భారత సాధారణ సమ్మెల్లో ఏనాడూ వెనకాడకుండా భాగస్వామ్యమవుతోంది. విశాల కార్మిక, కర్షక ప్రయోజనాలకి తమవంతు కర్తవ్యంగా గొంతెత్తుతూ నికరంగా నిలబడుతోంది. ప్రపంచవ్యాప్త పోరాటాలకు సంఘీభావంగా కూడా నిలబడి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపుల్లో భాగమౌతున్నది. కార్మిక వర్గ ప్రయోజనాలు కేవలం మేనేజ్మెంట్ల దగ్గర మాత్రమే సాధించగలిగేవి కావు, వాటి మూలాలు రాజకీయ నిర్ణయాలతో ముడిపడి ఉన్నాయన్న వాస్తవాన్ని ఏనాడో గ్రహించి ప్రతి రాజకీయ ఆర్థిక మార్పులపై తనదైన విశ్లేషణాత్మక తీరులో ప్రతిస్పందనను ఎప్పటికప్పుడు బహిరంగపరుస్తూనే ఉన్నది. ప్రజల జీవన విధానాలను ప్రభావితం చేసే సున్నితమైన ప్రాంతీయ, జాతీయ, మతతత్వ అస్తిత్వ విధానాల పట్ల ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉండాలని సభ్యులను చైతన్యవం తులను చేస్తూనే ఉంది. అందుకే అది భారత కార్మికోద్యమ చరిత్రలో ఒక కలికితురాయిగా స్థిరమైన స్థానాన్ని పొందిందని చెప్పడంలో సందేహం లేదు. ఇంతటి చారిత్రాత్మక స్థానాన్ని పొందడానికి కామ్రేడ్ చంద్రశేఖర్ బోస్, సునిల్ మైత్ర, సరోజ్ చౌదరి, ఎన్.ఎమ్. సుందరం, మన్చందా వంటి వారెందరో త్యాగాలు నిక్షిప్తమై ఉన్నాయి. వారి తర్వాత తరాలు కూడా అదే ప్రస్థానాన్ని కొనసాగించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులు మరింత గడ్డుగా మారాయి. వీటిని ధీటుగా ఎదుర్కోవాలంటే విశాల పరస్పర సంఘీభావం ఎంతో అవసరం. దాన్ని సాధించి ముందుకు నడవగలదన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎఐఐఇఎకి ప్లాటినం జూబ్లీ సంవత్సర శుభాకాంక్షలు.
జి.తిరుపతయ్య
9951300016
The post 75 వసంతాల ఎ.ఐ.ఐ.ఇ.ఎ- భారత కార్మికోద్యమంలో సముచిత పాత్ర appeared first on Navatelangana.
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ), బీమా రంగంలోని ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెజారిటీ ట్రేడ్ యూనియన్. నేడు ప్లాటినం జూబ్లీ వసంతంలోకి అడుగిడుతున్నది. సంఖ్య పరంగా చిన్నదే అయినప్పటికీ అత్యంత ప్రభావంతమైన ప్రయాణాన్ని సాగించింది. ఎల్ఐసీ ఆవిర్భావానికి కన్నా ముందు అంటే 1జూలై 1951న పురుడు పోసుకుని సంస్థలోని ఉద్యోగుల భవిష్యత్తుని సుస్థిరమైన స్థితిలో, సహచర రంగాలన్నింటికన్నా మిన్నగా, నిర్మించింది.ఎల్ఐసీ ఆవిర్భావంతో పాటు దేశవ్యాప్తంగా అది పటిష్ట పడాలని భారత ఆర్థిక వ్యవస్థకు ఒక
The post 75 వసంతాల ఎ.ఐ.ఐ.ఇ.ఎ- భారత కార్మికోద్యమంలో సముచిత పాత్ర appeared first on Navatelangana.