Harish Rao | సిగాచి ఫార్మా మృతులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి : హరీశ్‌రావు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Harish Rao

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి.. అక్కడ అందిస్తున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు.

అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలుపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ పేలుడు జరిగి 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో ఫార్మా కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు. మిగతావారి పరిస్థితి తెలియరావడం లేదు. ఎంతమంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి. కుటుంబసభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు. తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ గారిని కలిసి చెప్పాను.’ అని అన్నారు.

‘ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు. వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కంట్రోల్ రూమ్‌ పెట్టాలని, కామన్ ఫోన్ నెంబర్ పెట్టాలని అధికారులకు సూచించాను. ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది. ఏం చేస్తున్నరు? వివరాలు తెలియక కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నరు? ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్భుతంగా పని చేస్తున్నది. కానీ ఇర్రెస్పాన్సిబుల్‌గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది. ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిస్ట్ పెట్టుకోండి.’ అని మాజీ మంత్రి అధికారులకు సూచించారు.

‘డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారు. 5 గంటల నుంచి ఏ వివరాలు లేవు. బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్నది ఈ ప్రభుత్వం. అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది. ఇక్కడకు వచ్చే కుటుంబసభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి. హ్యాండ్ మైక్ పెట్టుకుని గైడ్ చేసే బాధ్యత లేదా..? గాయపడ్డ వారిని ప్రైమరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు. 30 శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు..? ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.
మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు. నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.’ అని హరీశ్‌రావు విమర్శించారు.

‘క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్. కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్. ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్. పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన. గతంలో జరిగిన సంఘటనలో ఐదుగురు చనిపోయారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు..? ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలి.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి. చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి’ అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

​Harish Rao | పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి.. అక్కడ అందిస్తున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *