సార్క్కు ప్రత్యామ్నాయంగా కొత్త సంస్థ.. కొత్త ప్రతిపాదనపై చైనా,పాక్ కసరత్తు

Follow

- అవే సభ్య దేశాలతో ఏర్పాటుకు యత్నం
ఇస్లామాబాద్, జూన్ 30: ప్రస్తుతం నిస్తేజంగా మారిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్, చైనా సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం ఓ మీడియా కథనం పేర్కొంది. ప్రాంతీయ సమగ్రత, అనుసంధానం కోసం ఓ కొత్త సంస్థ అవసరమని అంగీకారానికి వచ్చిన చైనా, పాక్ ఈ దిశగా చర్చలు సాగిస్తున్నాయని ఈ పరిణామంతో ప్రమేయమున్న దౌత్యపరమైన వర్గాలను ఉటంకిస్తూ ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా పత్రిక పేర్కొంది. భారత్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకతో కూడిన సార్క్ స్థానంలో కొత్త సంస్థ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇటీవల చైనాలో కన్మింగ్లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పాల్గొన్నాయి. సార్క్లో సభ్యులైన ఇతర దేశాలను కూడా కొత్త సంస్థలోకి ఆహ్వానించాలని ఈ సమావేశంలో ఆ మూడు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చైనా, పాకిస్థాన్తో తాము చేతులు కలపనున్నట్లు వచ్చిన వార్తలను బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము ఎటువంటి పొత్తు కుదుర్చుకోవడం లేదని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎంటీ తౌహీద్ సోమవారం స్పష్టం చేశారు.
భారత్కూ ఆహ్వానం?
ప్రతిపాదిత కొత్త గ్రూపులో భారత్కు కూడా ఆహ్వానం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక, మాల్దీవులు, అఫ్గానిస్థాన్ వంటి దేశాలు ఆ గ్రూపులు సభ్యులుగా ఉంటాయని వారు చెప్పారు. వాణిజ్య పెంపుదల, కనెక్టివిటీ ద్వారా మరింత ఎక్కువ ప్రాంతీయ సహకారాన్ని సాధించడమే ఈ కొత్త సంస్థ ప్రధాన ఉద్దేశమని పత్రిక పేర్కొంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే భారత్-పాకిస్థాన్ ఘర్షణ కారణంగా చాలాకాలంగా నిస్తేజంగా ఉన్న సార్క్ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది.
ప్రస్తుతం నిస్తేజంగా మారిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్, చైనా సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం ఓ మీడియా కథనం పేర్కొంది.