Aleru Rural : ఇండ్లు, పొలాల్లోకి వెళ్లే దారి కబ్జా.. కలెక్టర్కు బాధితుల ఫిర్యాదు

Follow

ఆలేరు రూరల్, జూన్ 30 : తమ ఇండ్లు, పొలాల్లోకి వెళ్లే దారిని ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని పేర్కొంటూ బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమార్కుల చెర నుంచి దారిని విడిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఆలేరు మండలం బహదూర్ పేట గ్రామానికి చెందిన ఎరుకల(ఎస్టీ) కుటుంబాలు, గ్రామ రైతులు, ప్రజలు కలెక్టర్ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలంలోని బహుదూర్పేట గ్రామంలో బహదూర్పేట నుండి చిన్న కందుకూరును కలిపే లింక్ రోడ్డు గ్రామం ఏర్పడిన నాటి నుండి పక్క రోడ్డు కలదు. గ్రామ రెవెన్యూ మ్యాప్ ప్రకారం నక్ష రోడ్డు సర్వే నంబర్ 71 నుంచి కలదు. 150 మీటర్ల వరకు సర్వే నంబర్ 72 నుంచి రోడ్డు ఉంది. అయితే గ్రామానికి చెందిన బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు గతంలో సర్వే నంబర్ 72లో భూమిని కొనుగోలు చేశారు. వారు భూమి కొనుగోలు చేయక ముందు నుంచే వారి భూమిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ ఇటు 72ను, అటు సర్వేనెంబర్ 71ను ఆనుకుని మధ్యలో 150 మీటర్లు పొడవు వరకు 30 ఫీట్ల రోడ్డు కలదు.
ఇటీవలి కాలంలో బహుదూర్పేట గ్రామం ఆలేరు మున్సిపాలిటీలో విలీనం కావడంతో గ్రామంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గ్రామ నక్ష ప్రకారం 150 మీటర్ల వరకు సర్వే నంబర్ 71 ఉన్న బాటలో పూర్వం నక్ష బాట అని తెలియక అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో బలహీన వర్గాలకు, ఎరుకల కుటుంబాలకు ఇల్లు నిర్మాణం చేసి వారికి అప్పగించారు. అయితే సర్వే నంబర్ 72లో పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులు భూమి కొనుగోలు చేయగా సర్వే నంబర్ 72లో బాటకు మిగిలి ఉన్న సుమారు 0.08 గుంటల భూమి వీరికి గతంలో భూమి విక్రయించిన రైతుల పేరుమీద ధరణిలో రికార్డు వస్తున్నా దానిని గుర్తుంచి వీరు రైతులకు మాయమాటలు చెప్పి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం కొద్దిరోజుల తర్వాత తమ పాస్ బుక్ లో ఉన్న రికార్డ్ కంటే కబ్జాకు భూమి తక్కువ ఉందని, బహుదూర్పేట నుండి చిన్న కందుకూరు గ్రామానికి వెళ్లే రోడ్డును రెండు నెలల క్రితం ఆక్రమించారు. దీంతో ఎరుకల (ఎస్టీ) కుటుంబాలకు చెందినవారు, ప్రజలు, గ్రామ రైతులు జిల్లా కలెక్టర్, ఆలేరు తాసీల్దార్కు ఫిర్యాదు చేశారు.
పబ్లిక్ రోడ్డేనని తేల్చిన అధికారులు
బహుదూర్ పేట నుంచి చిన్న కందుకూరు కలిపే లింక్ రోడ్డును పైన పేర్కొన్న ఇద్దరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారని ప్రజల ఫిర్యాదుతో ఆలేరు తాసీల్దార్ ఆదేశాల మేరకు మండల అదనపు గిర్దావర్, మండల సర్వేయర్ 18మార్చి, 2025 రోజున మొకా మీదకు వచ్చి వందలాది మంది గ్రామ ప్రజల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు పబ్లిక్ రోడ్డేనని తేల్చి నివేదికలు తయారు చేసి తాసీల్దార్కు అందజేశారు. అనంతరం స్థానిక పోలీసుల సహాయంతో ఆక్రమించిన బాటను పునరుద్ధరించారు. కాగా సోమవారం బర్మ మల్లయ్య అనే వ్యక్తి తిరిగి రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద బండరాలను పెట్టి చుట్టూ కనీలను నాటి ఫెన్సింగ్ వేశాడు. దీంతో ఎరుకల (ఎస్టి) కుటుంబాల ప్రజలు తమ ఇళ్లకు వెళ్లకుండా రోడ్డును పూర్తిగా కబ్జా చేశాడు. అదే విధంగా వందలాది మంది రైతులు రాకపోకలు సాగించకుండా రోడ్డును కబ్జా చేశాడు.
రోడ్డును కబ్జా చేసిన విషయమై సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఎరుకల (ఎస్టీ )కుటుంబాలు, గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వ నిధుల ద్వారా హెలికాప్టర్ కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు కబ్జా చేసిన విషయమై బాధితులు పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికి సీఐ పట్టించుకోక, రోడ్డును ఆక్రమించిన వారికే సపోర్ట్ చేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. ఈ విషయమై ఆలేరు సీఐ కొండల్ రావుపై రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.

Aleru Rural : ఇండ్లు, పొలాల్లోకి వెళ్లే దారి కబ్జా.. కలెక్టర్కు బాధితుల ఫిర్యాదు
తమ ఇండ్లు, పొలాల్లోకి వెళ్లే దారిని ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని పేర్కొంటూ బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమార్కుల చెర నుంచి దారిని విడిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు.