Engineering Fee: ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజు పెంపు లేనట్లే..! కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

Follow

హైదరాబాద్, జులై 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులనే ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పాత ఫీజులే ఈ ఏడాదికి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-28 ఫీజుల ఖరారు చేసేందుకు త్వరలోనే అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు పాత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను పెంచడం రివాజుగా వస్తుంది. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కూడా. అయితే హేతుబద్ధంగా ఫీజుల పెంపును సిఫార్సు చేయడం కోసం రేవంత్ సర్కార్ ఓ కమిటీని నియమించనుంది.
ఆ కమిటీ తుది నివేదిక ఇచ్చేంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులనే ఈ విద్యా సంవత్సరానికి కూడా కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీ ఆర్క్, ఎంఆర్క్లతో పాటు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి, ఫార్మా డి(పీబీ), ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్, బీ వొకేషనల్ తదితర కోర్సులన్నింటికీ పాత ఫీజులే కొనసాగుతాయని పేర్కొంటూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా ఉత్తర్వుల మేరకు 2022 – 25 నాటి ఫీజులనే ఈ ఏడాది అమలు అవుతాయని తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫీజులను పరిశీలించి నివేదిక సమర్పించిన తర్వాత ఫీజులపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది. దీనితోపాటు కోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల పెంపుపై నిర్ణయం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిటీ సమీక్ష జరిగే వరకు, ప్రస్తుత ఫీజు నిర్మాణం అమలులో ఉండనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులనే ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పాత ఫీజులే ఈ ఏడాదికి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-28 ఫీజుల ఖరారు చేసేందుకు త్వరలోనే..