Harish Rao | రేవంత్ పాలనా వైఫల్యంతో నిర్వీర్యమవుతున్న గురుకులాలు: హరీశ్ రావు

Follow

Harish Rao | బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆరోపించారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం శోచనీయమని వెల్లడించారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే జులై 1 నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
మరోవైపు 13 నెలలుగా రూ.450 కోట్లకుపైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొన్నదని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో యూనిఫామ్ ఇవ్వకపోవడంతో పిల్లలు పాత, చినిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నారని తెలిపారు. పదేండ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థ, రేవంత్ (Revanth Reddy) పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమన్నారు.
దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద పిల్లల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు బకాయిలు వెంటనే చెల్లించాలని తెలిపారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగులు.. తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆరోపించారు.