Julurupadu : వేధింపులు తాళలేక ఎస్ఐ భార్య ఆత్మహత్య

Follow

జూలూరుపాడు, జూన్ 30 : ఖమ్మం రైల్వే ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తారింటి వేధింపులే ఇందుకు కారణంగా సమాచారం. జూలూరుపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీకి చెందిన రాజేశ్వరి (34)ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని రాములుతండాకు చెందిన బానోతు రాణా ప్రతాప్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.40 లక్షల నగదుతో పాటు 35 తులాల బంగారం, మరో రూ.4 లక్షల విలువ చేసే వస్తువులను కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలం తర్వాత రాజేశ్వరి భర్త రానా ప్రతాప్, అత్త పుష్పారాణి, మామ చంద్రం, బావ ఎస్ఐ మహేశ్ కలిసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారు. తాము చెప్పిన విధంగా నడుచుకోవాలని, అక్రమ సంబంధాలు అంటకట్టడం, తాము చెప్పిన ఇంట్లోనే ఉండాలంటూ, లేకుంటే ఆత్మహత్య చేసుకోవాలని మానసికంగా ఒత్తిడి చేసేవారు.
రాణా ప్రతాప్ జూలూరుపాడు ఎస్ఐగా పనిచేసిన సమయం నుండి భార్య రాజేశ్వరి జూలూరుపాడు లోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. ఈ క్రమంలో రాజేశ్వరిని గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో మానసికంగా వేధిస్తుండడంతో ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 25న రాత్రి గడ్డి మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 29 రాత్రి మృతి చెందింది. తన కుమార్తె రాజేశ్వరిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన భర్త రాణా ప్రతాప్, అత్త పుష్పావతి, మామ చంద్రం, బావ మహేశ్పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి కె.లోతు సోమ్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.
ఖమ్మం రైల్వే ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తారింటి వేధింపులే ఇందుకు కారణంగా సమాచారం.