Sigachi Industries | పాశమైలాపం పేలుడు ఘటనలో 45కు పెరిగిన మృతుల సంఖ్య.. గుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు

Follow

పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 45 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరణించినవారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను గుర్తించగా, మరో 20 గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. సోమవారం జగన్మోహన్, రామ్సింగ్ రాజ్బర్, శశిభూషణ్ కుమార్ మృతిచెందినట్లు గుర్తించగా, తాజాగా మరో ఆరుగురి పేర్లను అధికారులు ప్రకటించారు. లగ్నజిత్ దౌరి, బీ.హేమ సుందర్, రుక్సానా కతూన్, జీ.నికిల్ రెడ్డి, నాగేశ్వర్ రావు, పొలిషెట్టి ప్రసన్నగా గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉన్నది. అయితే మృతుల సంఖ్య 55కు పెరిగే అవకాశం ఉంది.
బాయిలర్ పేలడంతో మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ శిథిలాల కింద 20 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ధ్వంసమైన ప్లాంట్ను పక్కకు తొలగించారు.
కాగా, ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఉదయం అధికారిక ప్రకటన చేశారు. మొత్తం 47 మంది గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. 20 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. 27 మంది కార్మికుల ఆచూకీ తెలియాలేదన్నారు. తీవ్ర గాయాలతో 35 మందికి దవాఖానల్లో చికిత్స అందుతున్నదని, అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 42 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు.