Sigachi Industries | పేలుడులో సిగాచి వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ మృతి..! పాశమైలారంలో ఉద్రిక్తత..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Pashamailaram

Sigachi Industries | సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడంస్తుల భవనం కుప్పకూలగా.. శిథిలాల్లో మరికొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 108 మంది కార్మికులు ఉన్నారని సమాచారం. గాయపడ్డ కార్మికుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడులో కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ సైతం మృతి చెందారు. ఆయన ప్లాట్‌లోకి వచ్చిన సమయంలోనే రియాక్టర్‌ పేలుడు సంభవించినట్లు తెలుస్తున్నది. ప్రమాదం ధాటికి ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ పరిశీలించారు.

పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని మంత్రి వివేక్‌ పేర్కొన్నారు. అధికంగా పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేరస్తుందని చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమని.. ఘటన జరిగిన తర్వాత అధికారులంతా వేగంగా స్పందించారన్నారు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. కంపెనీలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే పౌడర్‌ తయారవుతోందని.. గత 40 ఏళ్లుగా సంస్థ పని చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం రియాక్టర్‌ పేలుడు సంభవించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు చికిత్స పొందుతూ చనిపోయారు. పేలుడు ధాటికి కార్మికులు దాదాపు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డట్లు పలువురు తెలిపారు. పేలుడు ధాటికి భవనం కూలిపోగా.. మరో భవనానికి పగుళ్లు వచ్చాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, హైడ్రా సిబ్బందిని మోహరించారు.

సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడులో పరిశ్రమ కార్మికుల అటెండెన్స్‌ రిజిస్టర్లు సైతం దగ్ధమయ్యాయని సమాచారం. రికార్డులు ధ్వంసం కావడంతో కార్మికుల హాజరు, వివరాలు అస్పష్టత నెలకొంది. వైస్‌ ప్రెసిడెంట్‌ మృతితో కార్మికుల గుర్తింపులో ఆలస్యం జరుగుతున్నది. పరిశ్రమలో అత్యధికులు బిహార్‌, ఒడిశాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ముగ్గురు కాంట్రాక్టర్ల ద్వారా రోజువారీ పనులకు కార్మికులు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి కార్మికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ కార్మికుల కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. పరిశ్రమలోకి చొచ్చుకు వెళ్లేందుకు కుటుంబాలు యత్నించగా.. పోలీసులు అడ్డుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల కుటుంబీకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మరో వైపు ఫ్యాక్టరీ వద్ద కార్మికుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.

​Sigachi Industries | సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *