Top Headlines @ 9 PM: టాప్ న్యూస్

Follow

లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. వారి అరెస్ట్లపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలకు కారణమైన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు సిట్ అధికారలుఉ… నిందితుల సంఖ్య మాత్రం 39కి చేరుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితుడుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమాలో కొత్తగా ఆరుగురిని నిందితులుగా చూపించారు. వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడులను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు నిందితులను అరెస్టు చేయటానికి సిట్ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తగా నిందితులుగా చేర్చిన ఆరుగురిలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు కాగా… ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. మిగతా అందరూ చెవిరెడ్డి సన్నిహితులే. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, నవీన్ కృష్ణ, హరీష్, బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో వీరిని పట్టుకోవడానికి ఏడు టీమ్లను సిట్ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు బెంగళూరు, హైదరాబాద్ సహా మూడు రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలిస్తున్నాయి. నిందితుల సెల్ఫోన్ ట్రాకింగ్, ఆర్థిక లావాదేవీల ఆధారంగా గాలింపు చర్యలను ముమ్మరం చేసింది సిట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుకు ముందు ఆయన దగ్గర పనిచేసిన గన్మెన్ మదన్ రెడ్డిని సిట్ విచారించింది. సరిగ్గా భాస్కర్ రెడ్డి అరెస్టు ముందురోజే సిట్ అధికారులపై మదన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను బెదిరించడంతోపాటు, దాడి చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని సిట్ అధికారులపై సీఎం, డీజీపీకి లేఖలు రాశారు. ఈ లేఖలు కలకలం రేపాయి. దీంతో పారదర్శక విచారణ చేస్తున్నామని సిట్ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. దీంతో వీలైనంత త్వరగా అరెస్టుల వ్యవహారాన్ని ముగించాలనే నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చారు.
రప్పా.. రప్పా.. నరకడానికి ఆయన ఏమైనా స్టేట్ రౌడీనా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఇంకా రప్పా.. రప్పా.. డైలాగ్ వీడడం లేదు.. ప్లకార్డులపై ఎప్పుడైతే రప్పా.. రప్పా.. డైలాగ్ రాసి ప్రదర్శించారు.. అప్పటి నుంచి ఈ డైలాగ్ రాజకీయ నేతల నోట వింటూనే ఉన్నాం.. మాజీ సీఎం వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇలా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఈ డైలాగ్ చూట్టూనే కామెంట్లు చేస్తున్నారు.. తాజాగా, వైఎస్ జగన్పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రప్పా.. రప్పా.. నరకడానికి వైఎస్ జగన్ ఏమన్నా స్టేట్ రౌడీనా? అని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరుగుతారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. జగన్ రప్పా.. రప్పా లాడిస్తాడనే ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.. తండ్రి (వైఎస్ రాజశేఖర్రెడ్డి) హయంలో లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి వైఎస్ జగన్ అని ఆరోపించారు.. రప్పా.. రప్పా అంటున్నారు కదా..? దమ్ముంటే ఎవరినైనా టచ్ చేసి చూడండి.. అంటూ సవాల్ చేశారు బొలిశెట్టి శ్రీనివాస్.. మరోవైపు, మేం రప్పా.. రప్పా ఆడించాలంటే 24 గంటలు చాలు.. కానీ మేం రౌడీలం కాదు అని పేర్కొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.
జగన్కు లండన్ మందులు పనిచేయడంలేదు.. యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్..!
వైఎస్ జగన్కు లండన్ మందులు పనిచేయడం లేదు.. కనీసం, యోగాతోనైనా ఆరోగ్యం సక్కబడుతుంది.. యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగ్లుగా చెబుతున్న జగన్.. రౌడీయిజం, హింస ప్రేరేపించేలా నీ పరామర్శ యాత్రలు ఏంటి? అని ప్రశ్నించారు.. కొట్టండి, చంపండి, వార్ డిక్లేర్ అంటూ చేసే హింసా నినాదాల్ని సమాజం క్షమించదు అని హెచ్చరించారు.. సినిమాల్లో మనుషుల్ని చంపారని నిజ జీవితంలోనూ చంపేస్తారా..? జగన్ కు ఇదేం మానసికస్థితి, రోగం అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. పుష్ప సినిమాల్లో మనుషుల్ని చంపారని.. నిజ జీవితంలోనూ చంపేస్తారా…? జగన్ కు ఇలాంటి మానసిక స్థితి ఏమిటని ఆగ్రహo వ్యక్తం చేశారు. ఇక, రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది యోగా పట్ల అవగాహన పెంపొందించుకున్నారు.. వైఎస్ జగన్ అండ్ టీం కూడా యోగా చేస్తే మానసిక స్థితి కుదుటపడుతుందని సూచించారు వాసంశెట్టి సుభాష్. యోగాంధ్ర నిర్వహణపై ప్రపంచమంతా ఆంధ్ర వైపు చూస్తోంది. పీఎం మోడీ, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో యోగాంధ్ర ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కిందన్నారు.. వైఎస్ జగన్ హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపారు. కొట్టండి, చంపండి అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారు. దేశంలోని ఏ రాజకీయనాయకుడికి, రాజకీయ పార్టీకి ఈ తరహా పోకడలు లేవు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరం.. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్ లు, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారని మండిపడ్డారు.
కడప కార్పొరేషన్లో కోల్డ్ వార్.. కమిషనర్ సహా 8 మందికి మేయర్ షోకాజ్ నోటీసులు..
కడప మున్సిపల్ కార్పొరేషన్లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది.. మున్సిపల్ కమిషనర్ వర్సెస్ మేయర్గా మారింది పరిస్థితి.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్తో పాటు ఎనిమిది మంది అధికారులకు మేయర్ సురేష్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, ఎస్ఈ, ఎంహెచ్వో, మేనేజర్, కౌన్సిల్ సెక్రటరీ, ఇద్దరు ఆర్వోలకు నోటీసులు జారీ చేశారు.. ఈ నెల 13వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా కాపీలు అందించినా.. ఎందుకు సర్వ సభ్య సమావేశానికి హాజరు కాలేదని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.. శుక్రవారం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారు అయ్యారో సమాధానం చెప్పాలని ఆయన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట..
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్రెడ్డి రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్ఐఆర్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్చి ఫైవ్ చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున బెయిల్ మంజూరు చేయాలని లీగల్ టీం వాధించింది. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఉరేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య.. ఎందుకంటే..?
హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరూ మైనర్లు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన బాలికలుగా పోలీసులు గుర్తించారు. మృతుల పేర్లు వినీల (17), అఖిల (16). వినీల ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్కి చున్నీతో ఉరి వేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.
విషాదం.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత..
తమిళనాడులో పెను విషాద ఘటన చోటుచేసుకుంది.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల బాలిక రోషిణిని చిరుతపులి లాక్కెళ్లి దాడి చేసింది… కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్లో పనిచేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యలు తరువాత అటవీ ప్రాంతంలో బాలిక శరీర భాగాలను గుర్తించారు పోలీసులు.. అప్పటికే చిరుత పులి బాలికను సగం తిన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.. కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్లో పని చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఆడుకోమని చెప్పి.. అక్కడికి కొద్ది దూరంలోనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో రాకాసి చిరుత.. పాపం.. ఆడుకుంటున్న చిన్నారి రోషిణిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని.. అడవుల్లోకి లాక్కెళ్లింది. నాలుగు సంవత్సరాల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్లోని సౌత్ డివిజన్లో చోటు చేసుకుంది.
సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయలేమన్న ఈసీ.. మండిపడ్డ రాహుల్ గాంధీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని రిలీజ్ చేయాని విపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఇవాళ (జూన్ 21న) కీలక ప్రకటన చేసింది. ఓటింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్కు సంబంధించిన సీసీ ఫుటేజ్లను బహిరంగ పేర్చలేమని తేల్చి చెప్పింది. అలాంటి వీడియో కంటెంట్ను షేర్ చేయడం వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొనింది. అంతేగాక, ప్రజాస్వామ్య ప్రక్రియకు సైతం ప్రమాదం వాటిల్లుతుందని తెలిపింది. సీసీ ఫుటేజీని విడుదల చేయాలనే డిమాండ్లు పారదర్శకతను ప్రోత్సహించేలా ఉన్నప్పటికీ, అవి ప్రతికూలమైవని, చట్టబద్ధంగా కుదరదని చెప్పుకొచ్చింది ఈసీ. అయితే, సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడమంటే.. 1950, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు సుప్రీంకోర్టు సూచనలను ఉల్లంఘించడమే అవుతుందని ఎన్నికల సంఘం చెప్పుకొచ్చింది. ఇక, ఈసీ ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. సమాధానాలు చెప్పాల్సిన వాళ్లే ఆధారాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపాం.. ఓటరు లిస్టు? దానిని మెషిన్-రీడబుల్ ఫార్మాట్లో అందించరు.. సీసీ ఫుటేజ్ దాచడానికి చట్టంలో మార్పులు చేశారు.. ఎన్నికల ఫోటోలు, వీడియోలు ఏడాది పాటు ఉంచే బదులు వాటిని కేవలం 45 రోజుల్లోనే తొలగిస్తారని తెలిపారు. దీని ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుందని విమర్శలు గుప్పించారు.
ఇరాన్కు భారీ షాక్.. ఖుద్స్ ఫోర్స్ కమాండర్ హతం
ఇరాన్లోని కీలక ప్రదేశాలు, ముఖ్య నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుంది. తాజాగా, టెహ్రాన్కు మరో షాక్ తగిలింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీ చనిపోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్ నుంచి హమాస్, హెజ్బొల్లా, హూతీ తదితర సంస్థలకు ఆయుధాల సరఫరాలో షాహ్రియారీ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొనింది. ఇక, శుక్రవారం నాడు టెల్ అవీవ్ ఫైటర్ జెట్లు చేసిన దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం.. డ్రోన్ యూనిట్ కమాండర్ సయీద్ ఇజాది సహా పలువురు నేతలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇవాళ (జూన్ 21న) ధ్రువీకరించాయి. కాగా, 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై టెహ్రాన్ చేసిన దాడులకు ప్రణాళికలు రచించింది అతడే అని పేర్కొన్నాయి. ఇరాన్, హమాస్ల మధ్య కీలక సమన్వయ కర్తగానూ ఇజాది వ్యవహరించాడని తెలిపాయి. అయితే, ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన అత్యున్నత సైనిక అధికారులతో పాటు అణుబాంబు తయారీలో పని చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు సైతం ప్రాణాలు కోల్పోయారు.
కుబేర మూవీ.. ట్రెండింగ్ లో అల్లరి నరేశ్..
శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర హిట్ టాక్ దక్కించుకుంది. నాగార్జున, ధనుష్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. బిచ్చగాడిగా ఆయన నటనను చూసి మెచ్చుకోని వారు లేరు. ఆయన్ను బిచ్చగాడిగా చూసిన వారంతా అల్లరి నరేశ్ ను గుర్తుకు చేసుకుంటున్నారు. అల్లరి నరేశ్ 18 ఏళ్ల క్రితం పెళ్లయింది కానీ మూవీలో బిచ్చగాడి పాత్రను చేశాడు. ఆ మూవీని దివంగత ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో అల్లరి నరేశ్ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి పాత్రలో నటిస్తాడు. అందులో తన భార్య (కమలీని ముఖర్జీ)ని ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెల్లి జరిపిస్తాడు. కోట్లకు వారసుడు అయినా అల్లరి నరేశ్.. అయిన వారి చేతిలో మోసపోయి చివరకు చెత్తకుప్పల వద్ద బిచ్చగాడిగా జీవిస్తాడు. అందులో బిచ్చగాడిగా అతను జీవించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ధనుష్ నటించిన పాత్ర అచ్చం అల్లరి నరేశ్ పాత్రకు సరిపోయే విధంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
కన్నప్ప మేకింగ్ వీడియో.. ప్రభాస్ ఎలా చేస్తున్నాడో చూడండి..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రాబోతోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప నుంచి మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కన్నప్ప షూటింగ్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ చూశారు. మెయిన్ గా విష్ణు యాక్ష్మన్ సీన్లు, హీరోయిన్ తో సాంగ్, ఇతర సీన్లను చూపించారు. చివరలో ప్రభాస్ మేకింగ్ వీడియోను చూశారు. గ్రీన్ మ్యాట్ వేసిన సెట్ లో ప్రభాస్, విష్ణు సీన్ చేస్తున్న విజువల్ ఉంది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కన్నప్ప షూటింగ్ దాదాపు న్యూజిలాండ, ఇతర ప్రాంతాల్లోనే చేశారు. పచ్చని కొండ ప్రాంతాల్లో ఈ షూట్ ను చేశారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ నటించారు. వీరు ఇప్పటి వరకు ప్రమోషన్లలో పాల్గొనలేదు. కారణం ఏంటో తెలియట్లేదు గానీ.. చివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా రావట్లేదు. అదే ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు విష్ణు స్పందించలేదు. మొన్న కేరళలో మోహన్ లాల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. కానీ మళ్లీ ఎక్కడా కనిపించకుండా పోయారు. మరి రిలీజ్ సమయానికి ఏమైనా కనిపిస్తారో లేదో చూడాలి.
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 9 PM